
మన హీరోయిన్స్లో చాలామంది షూటింగ్స్ మధ్య ఏమాత్రం చిన్న గ్యాప్ దొరికినా రిలాక్స్ అవడానికి మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి అందమైన లొకేషన్స్లో సేదతీరుతూ అభిమానులను ఆకట్టుకునే రీతిలో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలాంటి బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ మాల్దీవులకు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో స్పెషల్ సమ్మర్ సేల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అక్కడి టూరిజం సంస్థ.. ఇందులో భాగంగా కత్రినాను ఎంపిక చేసినట్టు తెలియజేసింది.
సహజ సౌందర్యంతో పాటు ఎంతో ప్రశాంతంగా ఉండే ఇలాంటి ఓ అందమైన ప్రదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని కత్రినా చెప్పింది. ఆమధ్య భారత పర్యాటకం, ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. భారతీయులంతా మాల్దీవులను బహిష్కరించడంతో అక్కడ టూరిజం పతనమైంది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారత్తో సత్సంబంధాలకు ప్రయత్నిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు వచ్చే నెలలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించబోతున్నట్టు సమాచారం. ఆయన పర్యటనకు ముందే కత్రినా ఎంపిక జరగడం విశేషం.