వాళ్లంతా మా కోవర్టులే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

వాళ్లంతా మా కోవర్టులే..  మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  మేడ్చల్ జిల్లా లో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అన్నారు. వాళ్లంతా తన మనుషులేనని...తన  కోవర్టులేనని చెప్పారు.  వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ లో చేరతారన్నారు. బోయిన్ పల్లిలో  కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత,  మల్కాజిగిరి ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో మల్లారెడ్డి ఈ కామెంట్స్ చేశారు.  

రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు మల్లారెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్నారు.  బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణ రావు, వివేకనంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఉప ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.