భారతదేశ పంచవర్ష ప్రణాళికలు.. నాడు ప్రణాళికా సంఘం నుండి నేడు నీతి ఆయోగ్ వరకు !

భారతదేశ పంచవర్ష ప్రణాళికలు.. నాడు ప్రణాళికా సంఘం నుండి నేడు నీతి ఆయోగ్ వరకు !

భారతదేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడానికి మన ప్రభుత్వం గతంలో అమలు చేసిన 'పంచవర్ష ప్రణాళికల' ప్రయాణాన్ని అలాగే  స్వాతంత్రం  వచ్చినప్పటి నుండి దేశంలో వనరులను వాడుకుంటూ, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక రంగాలను ఎలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చామో.. చివరకు 'నీతి ఆయోగ్' ఏర్పాటు వరకు జరిగిన మార్పులను చూద్దామా....

స్వాతంత్రం  వచ్చే నాటికి పెట్టుబడి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరతగా ఉండటం వల్ల సహజవనరులను పూర్తిగా ఉపయోగించే స్థాయిలో భారతదేశం లేదు. రష్యా అమలుపరుస్తున్న ప్రణాళికా విధానాన్ని మన దేశంలో కూడా ప్రవేశపెట్టి వనరులను గరిష్టంగా వినియోగించాలని ప్రభుత్వం భావించింది. అందువల్ల ప్రధాని అధ్యక్షతన 1950, మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఐదేళ్ల కాల పరిమితితో 12 ప్రణాళికలను అమలు చేశారు. కేంద్రంలో అధికార మార్పిడితో ప్రణాళిక సంఘం రద్దయింది. నీతి ఆయోగ్ ప్రారంభమైంది.

మొదటి ప్రణాళిక (1951-56): మన దేశంలో 1951–56 మధ్య అమలు చేసిన మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. హరడ్​, డోమర్​ వృద్ధి నమూనా ఆధారంగా విధానాలను రూపొందించి అమలుచేసి ఆర్థికాభివృద్ధి సాధించారు. ఈ ప్రణాళికా కాలంలో సాధించిన వృద్ధిరేటు 4.6శాతం. 

రెండో ప్రణాళిక(1956-61): రెండో పంచవర్ష ప్రణాళికను పారిశ్రామికరంగ ప్రాధాన్యతతో అమలుచేశారు. మహలనోబిస్​ నాలుగు రంగాల వృద్ధి నమూనా ఆధారంగా ఇది రూపొందింది. దీనిని పరిశ్రమలు, రవాణా ప్రణాళిక అంటారు. రూర్కెలా, బిలాయ్​, దుర్గాపూర్​ వంటి భారీ ఉక్కు కర్మాగారాలను, నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ను ప్రారంభించారు. ఈ ప్రణాళికలో అసంతులిత వృద్ధి వ్యూహానికి ప్రాధాన్యత ఇవ్వడమైంది. ఈ ప్రణాళికా కాలంలో 4.1శాతం వృద్ధిరేటు సాధించారు. 

మూడో ప్రణాళిక (1961-66): స్వయం సమృద్ధి లక్ష్యంగా 1961–66 మధ్య మూడో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. అశోక్​మెహతా నమూనా ఆధారంగా ఇది ప్రారంభించారు. 1962 చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్​తో యుద్ధం, కరువు, సకాలంలో విదేశీ సహాయం అందకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాం. 

వార్షిక ప్రణాళికలు (1966-69): విదేశాలతో యుద్ధాలు, అనావృష్టి తదితర పరిస్థితుల వల్ల నాలుగో ప్రణాళికను ప్రవేశపెట్టే స్థితిలో లేకపోవడంతో 1966–69 మధ్య ప్రణాళికా సెలవును ప్రకటించారు. దీనిని ప్లాన్​ హాలిడే అంటారు. వీటిని పిగ్మీ ప్రణాళికలు అని కూడా అంటారు. ఈ కాలంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని అమలు చేసి వ్యవసాయాభివృద్ధికి దోహదపడ్డారు. ఆహార ధాన్యాలు, ముఖ్యంగా గోధుమ ఉత్పత్తి గణనీయంగా పెంచారు.

నాలుగో ప్రణాళిక (1969-74): అనుకూల పరిస్థితులు నెలకొనడంతో 1969–74 మధ్యకాలంలో నాలుగో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళికలో స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వావలంబన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికకు అశోక్​రుద్రా, అలెన్​.ఎస్​.మానెల నమూనా ఆధారమైంది. అయితే గాడ్గిల్​ ఈ ప్రణాళిక ముసాయిదాను తయారు చేశారు. మొదటిసారిగా 1972–73లో భారత వ్యాపార శేషంలో మిగులు కనిపించింది. 5.7 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నా 3 శాతం మాత్రమే సాధించింది. 

ఐదో ప్రణాళిక (1974-79/78): పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలతో ఐదో ప్రణాళిక అమలుపర్చారు. ఈ ప్రణాళికా కాలంలో కనీస అవసరాల కార్యక్రమం, 20 సూత్రాల కార్యక్రమం, పనికి ఆహారం పథకం ప్రారంభించారు. ఈ ప్రణాళికలో లక్ష్యం(4.4 శాతం) కంటే ఎక్కువ(5) వృద్ధి సాధించడమైంది. 

సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక ఇది.
నిరంతర ప్రణాళికలు(1978-80): ఐదో ప్రణాళికనుసంవత్సరం ముందుగా రద్దు చేసి జనతా ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశ పెట్టింది. గున్నార్​ మిర్ధాల్​ రూపొందించిన నిరంతర ప్రణాళిక డ్రాప్టును మన దేశంలో డి.టి.లక్డావాలా రూపొందించారు. ప్రఖ్యాతిగాంచిన ఐఆర్​డీపీ పథకం 1978–-79లో ప్రవేశపెట్టారు. ఈ ప్రణాళికలో కుటీర చిన్న పరిశ్రలకు ప్రాధాన్యత  ఇచ్చారు. 

ఆరో ప్రణాళిక(1980-85): పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన లక్ష్యాలతో ఆరో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. పెట్టుబడి, అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటారు. దీనిలో అధిక కేటాయింపులు శక్తి రంగంపై చేశారు. ఆశించిన వృద్ధిరేటు 5.2 శాతం కాగా సాధించింది 5.3 శాతం.

ఏడో ప్రణాళిక(1980-85): ఆహారం, పని, ఉత్పాదకతకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిలో మహల్​నోబిస్​ వ్యూహాన్ని అనుసరించలేదు. కొంత వరకు వకీల్​, బ్రహ్మానందాల వేతన వస్తు వ్యూహాన్ని అనుసరించారు. దీనిలో అధిక కేటాయింపులు శక్తి రంగంపై చేయడం వల్ల దీనిని శక్తి ప్రణాళిక అని కూడా అంటారు.  5 శాతం వృద్ధిరేటు ఆశించిగా 6 శాతం వృద్ధిరేటు సాధించడమైనది.

ఎనిమిదో ప్రణాళిక (1992-97): మానవ వనరులైన విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎనిమిదో ప్రణాళికను అమలుచేశారు.  మొదటిసారిగా మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. సూచనాత్మక ప్రణాళికను అమలుపర్చారు. నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఆర్థిక పరిస్థితి చక్కబడింది. మొదటిసారిగా ప్రభుత్వరంగం కంటే ప్రైవేట్​ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 5.6 శాతం ఆర్థిక వృద్ధిరేటు లక్ష్యం కాగా 6.8 శాతం వృద్ధిరేటు సాధించారు. 

తొమ్మిదో ప్రణాళిక (1997-2002): సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం లక్ష్యాలతో ఇది అమలుపర్చారు. లక్ష్యసాధనలో విఫలమైనప్పటికీ పేదరికాన్ని తగ్గించడంలో సత్ఫలితాలను సాధించింది. ఎస్​జీఎస్​ఆర్​వై, ఎస్​జీఎస్​వై, ఎస్​జీఆర్​వై వంటి ఉపాధి కల్పనా పథకాలను ఈ ప్రణాళికలో ప్రవేశపెట్టారు.   వ్యవసాయ విధానాన్ని 2000లో ప్రకటించారు. 

పదో ప్రణాళిక (2002-07): వృద్ధిరేటు 8 శాతం సాధించాలని, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, పేదరిక నిష్పత్తిని 15 శాతానికి తగ్గించాలని ప్రయత్నించారు. ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి రాష్ట్రీయ సమవికాస్​ యోజనను ప్రవేశపెట్టారు. మొదటిసారిగా దీనిలో 10 నిర్దేశిత లక్ష్యాలను ప్రకటించారు. పొదుపు, పెట్టుబడులు లక్ష్యాన్ని మించినా పేదరికాన్ని, నిరుద్యోగితను అనుకున్న స్థాయికి తగ్గించలేకపోయాం. 

11వ ప్రణాళిక(2007-12): వేగవంతమైన సమ్మిళితవృద్ధి సాధన లక్ష్యంతో దీనిని అమలు చేశారు. దీనిలో 27 నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశించారు. సాంఘిక సేవలకు, ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆమ్ఆద్మీ బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వంటి స్కీమ్స్​ను  ప్రారంభించారు. 

పన్నెండో ప్రణాళిక (2012-17): వేగవంతమైన, సుస్థిర సమ్మిళిత వృద్ధిని సాధించాలని 8శాతం వృద్ధిరేటు లక్ష్యంగా అమలుపర్చారు. దీనిలో 25 నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశించారు.  

నీతి ఆయోగ్​(2017-32): 2014లో రాజకీయ పరిస్థితులు మారడం వల్ల ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్​ను ఏర్పాటు చేశారు. ఫలితంగా 12వ ప్రణాళిక తర్వాత వెంటనే 15 సంవత్సరాల కాలానికి నీతి ఆయోగ్​ విజన్​ను 
రూపొందించారు.