
మల్లారెడ్డి యూనివర్శిటీ స్టూడెంట్ .. లాలాగూడలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్..
జీడిమెట్ల, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్లో ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సందనాల లీలా నాగవినయ్దుర్గ(19) మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐఎంఎల్ ఫస్ట్ ఇయర్ చదువుతూ వారి హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం ఉదయం క్లాసులకు వెళ్లి, మధ్యాహ్నం 12:30 గంటలకు హాస్టల్కు భోజనం కోసం వచ్చాడు. విద్యార్థులంతా భోజనం చేసి కాలేజీకి వెళ్లగా, వినయ్దుర్గ మాత్రం అక్కడే ఉన్నాడు.
భోజనాల అనంతరం హాస్టల్ వార్డెన్ గదులను తనిఖీ చేస్తుండగా రూమ్ నంబర్ 10 లోపలి నుంచి తాళం వేసి ఉంది. వెంటిలేటర్ నుంచి చూడగా వినయ్దుర్గ టవల్తో ఫ్యాన్కు ఉరేసుకుని కన్పించాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
లాలాగూడలో యువతి..
లాలాగూడ: లాలాగూడలో డిగ్రీ చదువుతున్న యువతి సూసైడ్ చేసుకుంది. లాలాగూడలో నివాసముండే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రమోద్ కుమార్ పెద్ద కూతురు మౌలిక(19) తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది. కొన్ని నెలలుగా మౌలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు మృతురాలి స్నేహితులు తెలిపారు.