కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని కాంగ్రెస్ నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. భద్రాచలం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటనేనని చెప్పారు. భద్రాచలానికి కాంగ్రెస్ తప్ప మరో పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ హయాంలో 125 కోట్లతో ఈ ప్రాంతానికి మంచినీళ్లను అందజేశామని గుర్తుచేశారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతకాలని అటవీ హక్కుల చట్టాన్ని కూడా కాంగ్రెస్ తెచ్చిందని చెప్పారు. దశాబ్ద కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు రాలేదని, నియామకాలు జరగలేదని భట్టి విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అందరూ కలిసి పోరాడాలని చెప్పారు. ఏడు మండలాలు బిల్లులో పెట్టకపోయినా దొంగచాటుగా బీజేపీ ఆర్డినెన్స్ ఇచ్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఉన్న భద్రాచలాన్ని కూడా కేసీఆర్ మూడు ముక్కలు చేశారని విమర్శించారు.