ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ దగ్గర రక్షణ శాఖ భూములు సహా... అనేక అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 15 అంశాల పట్ల ప్రధానికి విజ్ఞప్తులు అందజేశారని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలన్నారు. నీటి ప్రాజెక్టులు, ఆర్ధిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి..కాబట్టి ప్రత్యేక ప్రతినిధిగాతనకు బాధ్యతలు ఇచ్చారని చెప్పారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు మల్లు రవి. నమ్మకం, పనిచేసే సమర్ధత గుర్తించి తనకు ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదని.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు.