సీఏఏ రూల్స్​ రాజ్యాంగ విరుద్ధం: మమతా బెనర్జీ

సీఏఏ రూల్స్​ రాజ్యాంగ విరుద్ధం: మమతా బెనర్జీ

బారాసత్ : పౌరసత్వ సవరణ చట్టం–2019 (సీఏఏ)ను కేంద్రంలోని బీజేపీ సర్కారు నోటిఫై చేయడంపై బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.  సీఏఏ నిబంధనలు అస్పష్టంగా, రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు. నార్త్​ 24 పరగణాల జిల్లాలోని హబ్రాలో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు నమ్మకం లేదని అన్నారు.   నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్​ (ఎన్​ఆర్​సీ) అమలుతో సీఏఏ ముడిపడి ఉన్నదని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తారని, రాష్ట్రంలో సీఏఏ అమలును తాను అనుమతించబోనని తెగేసి చెప్పారు. ‘సీఏఏ కింద పౌరసత్వం కోసం అప్లై చేసుకొనేటప్పుడు ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే పౌరులుగా ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారు వెంటనే శరణార్థులుగా మారిపోతారు.  మళ్లీ కొత్తగా కమిటీ దయతలచి పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది’ అని మమత పేర్కొన్నారు. 

పౌరసత్వ హక్కులను లాక్కునే కుట్ర!   

ఎవరైతే పౌరసత్వానికి అర్హులు కారో వారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారని మమతా బెనర్జీ వెల్లడించారు. ఇది పౌరసత్వ హక్కులను లాక్కోవడానికి బీజేపీ పన్నిన పన్నాగమని అభివర్ణించారు. ఈ దేశంనుంచి క్రిస్టియన్లు, ముస్లింలు, నామశూద్రులను వెళ్లగొట్టే కుట్ర జరుగుతున్నదని, బెంగాల్​ను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దీన్ని తాను జరగనివ్వబోనని స్పష్టం చేశారు. శరణార్థులకు పౌరసత్వం వస్తే తనకు సంతోషమేనని, తిరస్కరించిన వారికి తాను షెల్టర్​ ఇస్తానని భరోసా ఇచ్చారు.