ఓల్డ్ సిటీ, వెలుగు: నకిలీ ఫోన్పే యాప్ స్క్రీన్షాట్లతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ శనివారం వివరాలు వెల్లడించారు. భవానీనగర్ తలాబ్కట్టకు చెందిన అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరి అలియాస్ అబ్దుల్లా (25) ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్నాడు.
ఈ నెల 6న చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద అబ్దుల్ నాసర్ అనే వ్యక్తి రూ.10 వేలు డిపాజిట్ చేస్తుండగా అబ్దుల్లా అతడిని సంప్రదించాడు. తనకు నగదు అవసరమని, ఫోన్పే ద్వారా డబ్బు పంపిస్తానని నమ్మించాడు. తన మొబైల్లోని నకిలీ యాప్ ద్వారా డబ్బు పంపినట్లు తప్పుడు స్క్రీన్షాట్ చూపించి బాధితుడి నుంచి నగదు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

