ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

లక్నో : తనను కాదని వేరే వ్యక్తితో పరిచయం పెంచుకున్న ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు. అడ్డపడిన ఆమె తమ్ముడిని కూడా కాల్చేశాడు. ఈ సంఘటన యూపీలో జరుగగా ఆలస్యంగా తెలిసింది. వివరాలు: కౌశాంబికి చెందిన షీలా(16) తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి నివసిస్తుంది. ఏడాది క్రితం ఆమెకు గంగా ప్రసాద్(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్లుగా షీలా.. ప్రసాద్‌ తో మాట్లాడటం మానేసింది. దీంతో మరో యువకుడితో ఆమె స్నేహం చేస్తున్నట్లుగా అనుమానించిన ప్రసాద్‌.. షీలాకు బుద్ధి చెప్పాలని భావించాడు. వారం రోజుల క్రితం ఆమె హత్యకు ప్లాన్ వేశాడు.

షీలా తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారని తెలుసుకున్న ప్రసాద్‌.. నాటు తుపాకీతో ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న షీలాపై అత్యాచారానికి యత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రసాద్‌ ఆమెను కాల్చి చంపేశాడు. అక్క అరుపులు విని గది నుంచి బయటకు వచ్చిన షీలా తమ్ముడు రాజేంద్ర(12)ను కూడా తుపాకీతో కాల్చి.. అక్కడి నుంచి పారిపోయాడు గంగా ప్రసాద్. ఈ ఘటనలో అక్కాతమ్ముళ్లు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.  షీలా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ జాడ కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం అతడిని అరెస్టు చేసి విచారించిన పోలీసులు.. ప్రసాద్‌ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తుందనే కారణంగానే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడని చెప్పారు పోలీసులు.