దండుగ పడుతుందని.. భయంతో ఆత్మహత్య 

దండుగ పడుతుందని..  భయంతో  ఆత్మహత్య 

రామాయంపేట, వెలుగు: దొంగతనం విషయంలో తనకు దండుగ(జరిమానా) పడుతుందనే భయంతో మెదక్​జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రంజిత్​ తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన బండారి యాదాగౌడ్(42) మద్యానికి బానిసై కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నెల 9న ఫుల్లుగా మద్యం తాగి స్థానిక పెద్దమ్మ తల్లి దేవాలయంలో చోరీకి యత్నించాడు. గ్రామస్తులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పెద్దలు పంచాయితీ పెట్టి దండుగ వేస్తారనే భయంతో సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం స్థానిక చెరువులో యాదాగౌడ్​శవమై తేలాడు. మృతుని  భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.