
- 9 నెలలుగా చికిత్స.. అయినా దక్కని ప్రాణం
- వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో ఘటన
రేవల్లి, వెలుగు: పాముకాటుతో 9 నెలలుగా చికిత్స పొందుతూ వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి ప్రాణాలు కాపాడుకునేందుకు, మృతుడి కుటుంబసభ్యలు రూ.20లక్షలు ఖర్చు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నాగపూర్ గ్రామానికి చెందిన మరికంటి మల్లేశ్(42) కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది అక్టోబర్ 8న పొలంలో పని చేస్తుండగా, కాలిపై పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నిమ్స్, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చివరికి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటి నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. ఈ 9 నెలల్లో చికిత్స కోసం బంధువులు, తెలిసిన వారి నుంచి రూ.20 లక్షల వరకు అప్పుగా తీసుకొని ఖర్చు చేశారు. ఇంత చేసినా పెద్ద దిక్కు దక్కకపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఓ వైపు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి, మరోవైపు చికిత్స కోసం తెచ్చిన అప్పులతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతోంది. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.