
హనుమకొండ, వెలుగు: వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిని సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్, సర్వీస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు సుబేదారి పీఎస్లో వివరాలు వెల్లడించారు. వరంగల్ రామన్నపేటకు చెందిన మంద శ్రీనివాస్ జీడబ్ల్యూఎంసీలో జవాన్గా పని చేసి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని ఆయన కొడుకు మంద కల్యాణ్కు ఇవ్వగా, 2019 నుంచి 2024 వరకు జవాన్గా పని చేశాడు.
ఉద్యోగంలో వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడం, ఈజీ మనీకి అలవాటుపడిన కల్యాణ్ ఉద్యోగాల పేరుతో మోసానికి తెరలేపాడు. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారిని ఎంచుకుని, తనకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని, కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద సంతకాన్ని ఫోర్జరీ చేసి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చేవాడు. వారి పేరుతో నకిలీ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసేవాడు.
తనకు తెలిసిన కూరపాటి భవ్య కిరణ్, మంద వంశీలతో కలిసి 40 మంది నుంచి రూ.16.14 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం తెలిసిన ఆర్డీవో ఈ నెల 21న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు సోమవారం మంద కల్యాణ్ ను అరెస్ట్ చేసి, 39 సర్వీస్ బుక్స్, 23 ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు, కారు, బైక్, కలర్ టీవీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.