- భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ అడ్డగింత!..
- కారులో వెళ్తూ బెంగళూరు ట్రాఫిక్లో చిక్కుకున్న గర్భవతి
- గాంధేయ పద్ధతిలో రోడ్డుపై కూర్చుని భర్త నిరసన
బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికితోడు వీఐపీ కాన్వాయ్ వస్తున్నప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భారతదేశపు సిలికాన్ వ్యాలీలో చిక్కుకుపోయి విసుగు చెందిన ఓ వ్యక్తి గాంధేయ పద్ధతిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపడం సోషల్మీడియాలో వైరల్గా మారింది. గర్భవతి అయిన తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా కర్నాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కాన్వాయ్ కోసం ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు.
ఒక రాజకీయ నాయకుడి సమయం ఎంత విలువైనదో.. ఒక సాధారణ పౌరుడి సమయం కూడా అంతే విలువైనదంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగాడు. నా భార్య గర్భవతి. మాకూ పనులున్నాయంటూ ఫైర్అయ్యాడు. మీరెందుకు సిగ్నల్ను అడ్డుకున్నారు?.. గవర్నర్ ఒక వీఐపీ అయితే మేమెవరూ కాదా? అంటూ రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నాడు. మీరు కూడా ఒక వీఐపీనే ప్రస్తుతం పక్కకు జరగండి అని ట్రాఫిక్ పోలీస్ చెప్పినా బాధితుడు వినిపించుకోలేదు.
వైరల్ అయిన వీడియోలో మాత్రం రద్దీగా ఉన్న రోడ్డు పక్క నుంచి కాన్వాయ్ వెళ్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన వీఐపీ సంస్కృతిపై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై ప్రధాని మోదీ గతనెలలోనే ప్రస్తావించారు. అధికార ప్రదర్శనల కన్నా సరళతకు, సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తూ, అధికారిక నియమ నిబంధనల విషయంలో సంయమనం, వ్యయ-సమర్థతతో కూడిన విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు.
