ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని వెంటనే అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేరే ఇంకెవరికైనా వైరస్ సోకుతుందన్న భయంతో కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారు.
మరోవైపు కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ లని తేలడంతో అధికారులు వారిని కూడా ఆసుపత్రికి తరలించే పనిలో పడ్డారు. వారు సన్నిహితంగా మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరిని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తాజాగా వైరస్ సోకిన వ్యక్తితో కలిపి తెలంగాణ భవన్లో మొత్తం ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.
ప్రస్తుతం యాభైశాతం సిబ్బందితో మాత్రమే తెలంగాణ భవన్లో అధికారులు పని చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ను పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
గత నెల మే లో ఢిల్లీలో పనిచేస్తున్న ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు కరోనా సోకింది. ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.