టికెట్ రీఫండ్‌‌కు ప్రయత్నిస్తే 5 లక్షలు కాజేశారు

టికెట్ రీఫండ్‌‌కు ప్రయత్నిస్తే 5 లక్షలు కాజేశారు

ముంబై: సైబర్‌‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. విమాన టికెట్లను రద్దు చేసి తన డబ్బులు వాపస్ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 5 లక్షలు కాజేశారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన బాధిత వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి కెన్యాలోని మొంబాసా సిటీకి టూర్ వెళ్దామనుకున్నాడు. దీనికోసం రూ.1.46 లక్షలు చెల్లించి ఈ నెల 29న వెళ్లి, మే 5న రిటర్న్ వచ్చేలా రానుపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు.

అయితే, ఇటీవల టూర్ షెడ్యూల్ మారడంతో టికెట్లు క్యాన్సిల్ చేసుకుని, రీఫండ్ పొందాలనుకున్నాడు. అందుకోసం బాధితుడు  గూగుల్​లో  సెర్చ్‌‌ చేసి సదరు ఎయిర్‌‌లైన్ వెబ్‌‌సైట్‌‌లో రీఫండ్ ఫామ్‌‌ కూడా నింపాడు. గూగుల్​లో  ఉన్న ఎయిర్‌‌లైన్ ఫేక్  హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్‌‌కు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన సైబర్ నేరగాడు.

ఎయిర్‌‌లైన్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. డబ్బు రీఫండ్ చేస్తానని నమ్మబలికి బాధితుడితో ఫోన్​లో ఓ యాప్ డౌన్‌‌లోడ్ చేయించాడు. ఆ వెంటనే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.4.8 లక్షలను కాజేశాడు. తన ఖాతాలో డబ్బు మాయమైందని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.