- బాధ్యతలు చేపట్టినా చార్జ్ ఇవ్వలే..
- ఏసీఎల్బీ చంద్రయ్యకే అదనపు బాధ్యతలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎన్.లలితకు నిరాశే ఎదురైంది. ఆమె పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉండడంతో డీఈవోగా చార్జి అప్పగించడానికి ఒప్పుకోలేదు. లోకల్ బాడీస్అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యకే అదనపు బాధ్యతలను కలెక్టర్ కుమార్ దీపక్ అప్పగించారు. దీంతో లలిత అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గానే కొనసాగుతున్నారు. ఇంతకుముందు డీఈవోగా పనిచేసిన యాదయ్య ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కావడం తెలిసిందే. ఆయన స్థానంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ ఇన్చార్జి డీఈవోగా పనిచేస్తున్న లలితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆర్డర్స్ జారీ చేశారు.
ఈమేరకు ఆమె గత శుక్రవారం మంచిర్యాల డీఈవో ఆఫీస్లో బాధ్యతలు చేపట్టారు. తనకు చార్జి అప్పగిస్తారని ఎదురుచూసినప్పటికీ అందుకు కలెక్టర్ ఒప్పుకోలేదని సమాచారం. గతంలో కరీంనగర్ డీఈవో ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసిన లలిత ఏడాది కిందట అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా ప్రమోషన్పై మంచిర్యాలకు వచ్చారు. మార్చిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ డీఈవో పోస్టు ఖాళీ కావడంతో ఆమెను ఇన్చార్జిగా నియమించారు. కరీంనగర్లో నివాసముంటున్న లలిత రోజూ మంచిర్యాల, ఆసిఫాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 11 తర్వాత రావడం, మధ్యాహ్నం 3గంటలకే వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేగాకుండా మంచిర్యాల జిల్లాలో ఆశ్రమ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే ఒక్కరోజు కూడా స్కూళ్లకు వెళ్లకపోవడం ఆమె పనితీరుపై అసంతృప్తిని మరింత పెంచింది. దీంతో ఆమెకు డీఈవోగా వచ్చిన చాన్స్ మిస్సయింది.
