ఆ ధర్నాలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు: మనోజ్

ఆ ధర్నాలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు: మనోజ్

తానేమీ రాజకీయ ప్రయోజనాల కోసం నడి రోడ్డు మీద దీక్షలు చేపట్టలేదని నటుడు మంచు మనోజ్ అన్నారు  ఏపీ ప్రభుత్వం నుంచి తమ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయమై మూడు రోజుల క్రితం తన తండ్రితో కలసి మనోజ్ రోడ్డుపై బైఠాయించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై ఈ రోజు  ట్విటర్ లో వివరణ ఇస్తూ..  శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ధర్నా వెనక ఎలాంటి రాజకీయా ఉద్దేశ్యాలు లేవని ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో.. “అందరికీ ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలనుకునే మనిషిని. ఒక మనిషికి సాయం చేసేటప్పుడు తన కష్టం తప్ప కులం, మతం చూడకూడదని పూర్తిగా నమ్మే మనిషిని. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం చేసిన దీక్షకి మద్దతుగా నేను నిలబడింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతోనే.  ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. మా కాలేజ్‌పై తప్పుడు ఆరోపణల చేయడంతో ఓ టిడీపీ కార్యకర్తపై నేను కాస్త కఠినంగా స్పందించా. అది మా నాన్నగారి కష్టార్జితంతో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని కట్టిన కాలేజ్‌’ అని అన్నారు.

ఇదే లేఖలో తాను పార్టీలకతీతంగా ప్రజాసేవ కోసం పనిచేసే మనిషనని మనోజ్ పేర్కొన్నారు. పదిమందికి మంచి చేసే ఏ పార్టీకి అయినా తాను మద్ధతుగా ఉంటానని, అదే విధంగా ప్రజలకు అన్యాయం చేసే ఏ పార్టినైనా నిలదీస్తానని మనోజ్ తెలిపారు.