
కల్ట్ క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అయిన మణిరత్నం.. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘థగ్ లైఫ్’. సుధీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. బాక్సాపీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం ప్రేక్షకుల తీర్పుపై స్పందించారు. ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయామని అందుకు తమను క్షమించమని కోరారు. ‘మా ఇద్దరి నుంచి అందరూ మరో ‘నాయకుడు’ చిత్రాన్ని ఆశించారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. మమ్మల్ని క్షమించండి. ఆ చిత్రం కంటే తక్కువ సినిమాను చేయడం మా ఉద్దేశ్యం కాదు.. అలా ఎలా అనుకుంటాం. మేం పూర్తి భిన్నమైన సినిమాను అందించాలి అనుకున్నాం.
జనం ‘థగ్లైఫ్’పై ఎక్కువ అంచనాలు వేయడంతో మేం ఊహించని ఫలితాన్ని అందుకున్నాం. మేం అందించిన దానికంటే ప్రేక్షకులు భిన్నమైన కథను మా నుంచి కోరుకున్నారని అర్థమైంది’ అన్నారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా సంచలనం విజయం సాధించింది. 37 ఏండ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ జూన్ 5న వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్ గత చిత్రం ‘ఇండియన్ 2’ డిజాస్టర్ కాగా, అంతకంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టడం ఆశ్చర్యపరిచింది.