
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైను నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఈ క్రమంలో ఏపీ ఎక్స్ప్రెస్, స్వర్ణజయంతి, గాంధీథాం రైళ్లను వయా విజయనగరం, రాయపూర్, నాగపూర్ మీదుగా మళ్లింపు మార్గంలో నడపనున్నట్టు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ -న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (20805), న్యూఢిల్లీ -విశాఖ (20806) ఏపీ ఎక్స్ప్రెస్ మార్గంలో దారి మళ్లిస్తారు. సెప్టెంబర్ 14, 21 తేదీల్లో విశాఖ -గాంధీథాం ఎక్స్ప్రెస్ (20803), సెప్టెంబర్ 24న గాంధీథాం- విశాఖ ఎక్స్ప్రెస్ (20804) నడుస్తుంది. సెప్టెంబర్ 22, 25 తేదీల్లో విశాఖ- నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ (12803) నడువనుంది. సెప్టెంబర్ 20, 24 తేదీల్లో నిజాముద్దీన్ -విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ (12804) రైళ్లు వయా విజయనగరం, నాగపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. అదేవిధంగా పూరి- వోకా ఎక్స్ప్రెస్ (20819) సెప్టెంబర్ 24న వయా విజయనగరం, నాగపూర్ మీదుగా నడుస్తుంది.