- 26 మందిపై రూ.1.32 కోట్ల రివార్డు
- మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అడవుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సలైట్ల గుర్తింపు పూర్తయింది. ఆదివారం ఉదయం మృతదేహాలను స్పెషల్ టీంలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. లొంగిపోయిన నక్సలైట్ల సాయంతో మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన 26 మందిలో ఆరుగురు మహిళా నక్సలైట్లున్నారు. అందరిపైనా కలిపి రూ.1.32 కోట్ల రివార్డున్నట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన చోటు నుంచి 29 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాటిలో ఐదు ఏకే 47 తుపాకులు, ఒక ఏకే యూబీజీఎల్ అటాచ్మెంట్, 9 ఎస్ఎల్ఆర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు 303 రైఫిళ్లు, తొమ్మిది 12 బోర్ తుపాకులు, ఒక పిస్టల్ ఉన్నాయన్నారు. చనిపోయినోళ్లలో మావోయిస్ట్పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మిలింద్ తేల్తుంబ్డే ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. కమాండర్లు లోకేశ్ అలియాస్ మంగు పొడియం, మహేశ్ అలియాస్ శివాజీలున్నట్టు చెప్పారు. మిగతా వారిని అడమా పొడియం, దలుసు రాజు, ప్రమోద్, కోసా, నేరా, చేతన్ పారా, విమల, కిషన్, ప్రదీప్(తేల్తుంబ్డే బాడీగార్డు), ప్రకాశ్, లచ్చు (బాడీగార్డు), నక్లూరాం తదితరులున్నారని పేర్కొన్నారు. మరణించిన మావోయిస్టుల్లో ఏడుగురు చత్తీస్గఢ్లోని బస్తర్కు చెందిన వారని ఐజీ చెప్పారు.
న్యాయవిచారణ జరిపించాలె: మావోయిస్టు పార్టీ
గ్యారపట్టి అడవుల్లో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి జిల్లాల కమిటీ కార్యదర్శి ఆజాద్ మండిపడ్డారు. చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కారు కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని, ఇందుకు వాళ్లు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బూటకపు ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలను అణచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచిపోషిస్తున్నాయని మండిపడ్డారు. అమాయకులకు డబ్బులు ఎరవేసి.. వారి ద్వారా మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటున్నాయన్నారు. మావోయిస్టులను అంతమొందించేందుకు తీవ్రస్థాయిలో నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నాయన్నారు. దండకారణ్యంలోని అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్, ఎంఎన్సీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, వారి దోపిడీకి అడ్డుగా ఉన్నామనే మావోయిస్టు పార్టీపై అణచివేతకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.