నాగం, కూచుకుళ్ల చేసిందేమీ లేదు 

నాగం, కూచుకుళ్ల చేసిందేమీ లేదు 
  • నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి వివాదస్పద వ్యాఖ్యలు

నాగర్​ కర్నూల్, వెలుగు:  మాజీ మంత్రి  నాగం జనార్దన్​ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిలపై  నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  ఐటీ రైడ్స్​ తర్వాత  మంగళవారం తిమ్మాజీపేట నుంచి భారీ ర్యాలీతో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఓపెన్​ టాప్​ వెహికిల్​లో   రోడ్​షో  నిర్వహించారు.  ఈసందర్భంగా కార్లు, బైక్​ ర్యాలీ మధ్య గజమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.  

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  90 ఏండ్లు దాటిన ముసలోళ్లకు పెండ్లి చేస్తే ఏం చేస్తరని ప్రశ్నిస్తూ ‘‘నాకు చేయండి నేనేందో చూపిస్తా’’ అని నాగం, కూచుకుళ్లను ఉద్దేశించి కామెంట్​ చేశారు. ఇద్దరూ అధికారంలో ఉండి నాగర్ కర్నూల్​కు  చేసిందేమిలేదని సెటైర్లు వేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారని నిలదీశారు.  తనను గెలిపిస్తే మంత్రినై  మరింత అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు.  బీజేపీ, కాంగ్రెస్​ కుట్రల వల్లే ఐటీ రైడ్స్​ జరిగాయని ఆరోపించారు.  ఐటీ అధికారులు తనకు క్లీన్​చిట్​ ఇచ్చారని చెప్పుకున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల  దేనికోసం పార్టీ మారుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు.