- డీజీపీకి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి లేఖ
పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో తీవ్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన వ్యక్తి సీఎంకు అత్యంత సమీపంలో సంచరించడం భద్రతా పరంగా పెను ముప్పు అని పేర్కొంటూ డీజీపీకి ఆయన బహిరంగ లేఖ రాశారు.
దేశ సార్వభౌమత్వానికి విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రం అలీ మహ్మద్ (అలియాస్ అబూ ఐమల్) అనే వ్యక్తి సీఎం దరిదాపుల్లో తిరుగుతుండటంపై శశిధర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో అబూ ఐమల్పై ఆయుధ చట్టం, విదేశీయుల చట్టం కింద కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. సీఎం భద్రతపై వెంటనే సమగ్ర సమీక్ష నిర్వహించాలని, ఈ వ్యవహారంలో అవసరమైతే జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం తీసుకోవాలని డీజీపీని కోరారు.
