మారుతి సుజుకి ఇండియా
బాగా పెరిగిన డిజిటల్ ఎంక్వైరీలు
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఆన్లైన్ ద్వారా రెండు లక్షల కార్లను అమ్మింది. రెండేళ్ల క్రితం కంపెనీ తన ఆన్లైన్ సేల్స్ ప్లాట్ఫామ్ను తెచ్చింది. ఈ సేల్స్ ప్లాట్ఫామ్పై దేశవ్యాప్తంగా ఉన్న సుమారు వెయ్యి డీలర్షిప్లను మారుతీ సుజుకి కవర్ చేస్తోంది. ‘2018లో కొత్త డిజిటల్ ఛానల్ను ప్రవేశపెట్టిన తర్వాత.. డిజిటల్ ఎంక్వైరీలు మూడింతలు పెరిగాయి. 2019 ఏప్రిల్ నుంచి రెండు లక్షలకు పైగా వెహికల్స్ను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించాం. 21 లక్షలకు పైగా కస్టమర్ ఎంక్వైరీలను జనరేట్ చేసేందుకు ఈ డిజిటల్ ఛానల్ ఉపయోగపడింది’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గూగుల్ ఆటో గేర్ సిఫ్ట్ ఇండియా 2020 రిపోర్ట్ ప్రకారం సుమారు 95 శాతం కొత్త కారు సేల్స్ ఇండియాలో డిజిటల్గా ప్రభావితమై జరుగుతున్నాయి. కస్టమర్లు మొదట ఆన్లైన్లో కొత్త కార్లను రీసెర్చ్ చేసి, ఆ తర్వాత ఫిజికల్ డీలర్షిప్ల వద్ద కొంటున్నట్టు పేర్కొంది. ఆన్లైన్ ఎక్స్పీరియెన్స్ కస్టమర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుందని తెలిపింది.
పది రోజుల్లో కొంటున్నారు..
తమ డిజిటల్ ఛానల్ ద్వారా ఎవరైతే కస్టమర్లు ఎంక్వైరీ చేస్తారో, వారు పది రోజుల్లో వెహికల్ను కొంటున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. డిజిటల్ ఎంక్వైరీలను సేల్స్గా మార్చడం చాలా తేలికవుతుందన్నారు. హైపర్–లోకల్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడంపై ప్రస్తుతం తాము పెట్టుబడి పెడుతున్నామని, ఇది కస్టమర్లు చాలా వేగంగా దగ్గర్లోని డీలర్స్ను కనెక్ట్ అయ్యేలా సాయపడుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో వెయ్యి మంది డీలర్షిప్లతో తాము ఇంటిగ్రేట్ అయ్యామని, 3 వేల ఆన్లైన్ టచ్పాయింట్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2017 నుంచే మారుతీ సుజుకి ఇండియా ఆన్లైన్లో బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. కస్టమర్ బిహేవియర్ ఆన్లైన్కు మరలిందని తెలిపింది. డీలర్షిప్ వెబ్సైట్లకు పెద్ద మొత్తంలో ట్రాఫిక్ వస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారితో గత ఐదు నెలల్లో డిజిటల్ ఎంక్వైరీ కంట్రిబ్యూషన్ 33 శాతానికి పైగా పెరిగిందని మారుతీ సుజుకి తెలిపింది.
Read more news…