
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సెజ్ లోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇది అతి పెద్ద ప్రమాదంగా మారింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుకు ఆ ప్రాంతం అంతా కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయ చర్యలు వేగవంతం చేశారు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు స్పాట్ కు చేరుకున్నాయి.
రియాక్టర్ పేలుడుకు కంపెనీకి చెందిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్ లో చాలా మంది కార్మికులు పని చేస్తున్నారని.. కేవలం ఆరుగురు మాత్రమే బయటకు వచ్చారని చెబుతున్నారు మిగతా సిబ్బంది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శిథిలాల తొలగింపును వేగంగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ పేలుడులో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. 20 మంది కార్మికులు చందానగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. 18 మంది ఇస్నాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు ఐదుగురు సజీవ దహనం అయినట్లు అధికారికంగా ప్రకటించిన అధికారులు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల కింద ఎంత మంది ఉన్నారు అనేది.. పూర్తిగా తొలగించిన తర్వాతనే తెలుస్తుందని వివరించారు అధికారులు.
శిథిలాల కింద 15 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు.10ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు ఫైర్ సిబ్బంది . అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో పెద్దఎత్తున కార్మికులున్నట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలికి చేరుకున్న హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నాయి.
పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు కుప్పకూలింది. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు వస్తున్నాయి. ఘాటైన వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఘటనాస్థలికి ఎవరూ రావొద్దని సూచించారు అధికారులు.