మేడారం జాతర .. వనదేవతల చరిత్ర ఇదే

 మేడారం జాతర .. వనదేవతల చరిత్ర ఇదే

పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క -సారక్కలను భక్తుల కష్టాలను కడతేర్చే వనదేవతలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే ఆపద్బాంధవులుగా గుర్తించి వనదేవతలుగా పూజిస్తున్నారు.

కోయ గిరిజనుల ఉనికికోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క, -సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెప్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.1996లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. మేడారం జాతర గురించి రెండు చారిత్రక ఆధారాలున్నట్లుగా రాష్ట్ర సర్కారు చెప్తోంది. ఈ ఆధారాల ప్రకారం రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. 

మొదటి కథ

13వ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది. అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్లగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపను వారు దైవ స్వరూపంగా భావించారు. ఆమెకు ‘సమ్మక్క’ అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన తర్వాత గిరిజన రాజైన పగిడిద్ద రాజుతో పెండ్లి చేశారు. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు కలిగారు.

ఓసారి మేడారంలో కరువు కాటకాలు వచ్చినయ్. ఆ పరిస్థితుల్లో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుకు ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చెల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు. అయినా పట్టించుకోని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు. ‘‘సంపంగి వాగు” అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. శత్రుసైన్యం పగిడిద్ద రాజును వెనకనుండి పొడిచి చంపారు. 

ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు, కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. దీంతో భ్రాంతి చెందిన శత్రుసైన్యం సమ్మక్క, సారలమ్మలను కూడా వెనుకనుండి పొడిచారు. జంపన్నను చంపి, వాగులో పడేశారు. అప్పటినుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది. ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ వారికి చిలకలగుట్ట ప్రాంతం వద్ద ఉన్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించింది. సమ్మక్క తల్లి.. కుంకుమ భరిణెగా మారిందని, సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్ముతారు.

రెండో కథ

13వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ఇప్పటి జగిత్యాల జిల్లాలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు.

ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహంతో ఉంటాడు.

అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికిబ తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. 

పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు... జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మారిన మేడారం జాతర తీరుసుమారు 900 ఏండ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరను1940 వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. 

ఆ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతీ జాతరకు భక్తులు పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మల చిహ్నంగా మేడారంలో గద్దెలు ఏర్పాటు చేశారు. రాను రాను మేడారం జాతర తీరు మారిపోయింది. మొదట్లో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు మహా జాతర నిర్వహించేవాళ్లు. మేడారంలోని గద్దెలపైకి జాతర రోజు అమ్మల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుంచి  సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. 

ఆ తర్వాత ‘మినీ మేడారం’ జాతర పేరుతో మధ్య ఏడాది వేడుకలు జరపడం మొదలుపెట్టారు. గత ఇరవై ఏళ్లుగా ఈ జాతర నిర్వహిస్తున్నారు. అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో లక్షలాది మంది భక్తులు హాజరై అమ్మలను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ‘మేడారం’ ఓ పుణ్యక్షేత్రంగా మారింది. గతంలో మహా జాతర, మినీ మేడారం జాతర సమయాల్లోనే వచ్చే భక్తులు ఇప్పుడు ప్రతీ రోజు ఇక్కడికి రావడం పరిపాటిగా మారింది. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత మేడారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ఏర్పాటు చేశారు.

భక్తుల సేవ కోసం పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించారు. మేడారంలోని అమ్మవారి గద్దెల చుట్టూరా గ్రిల్స్‌‌‌‌ ఏర్పాటు చేశారు. స్వాగత తోరణం, టెంపుల్‌‌‌‌ మాదిరిగా కనిపించే నిర్మాణాలు చేశారు. శాశ్వత మరుగుదొడ్లు, మూత్రశాలలను కట్టించారు. భక్తులు విడిది చేయడానికి సమ్మక్క, సారక్కల పేర్లతో భవనా‌‌లు నిర్మించారు. భక్తులు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. ఇవే కాక హరిత కాకతీయ హోటల్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ వెలిశాయి. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌‌‌, రెడ్డి గూడెం తదితర ప్రాంతాలలో కుటుంబంతో సహా భక్తులు విడిది చేయడానికి ప్రైవేట్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.