- మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
శామీర్ పేట, వెలుగు: ఈ నెల 8న ప్రధాని మోదీ సిటీ పర్యటనలో భాగంగా ప్రత్యేక ఫ్లైట్లో హకీంపేట ఎయిర్ పోర్టుకు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై బుధవారం ఆయన శామీర్పేటలోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమోయ్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రధాని పర్యటన మార్గాల్లో రోడ్డు రిపేర్ పనులు చేపట్టాలన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పటిష్ట బందోబస్తు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగవద్దన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నర్సింహా రెడ్డి, డీఆర్వో చంద్రావతి, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఓటింగ్ శాతం పెరగాలి
రాబోయే ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో ఓటింగ్ శాతం పెరగాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓటర్ జాబితా రూపకల్పనపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. జాబితాను ఎలాంటి తప్పుల్లేకుండా రూపొందించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న ఓటర్లకు సమీప పోలింగ్ బూత్కు మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.