
అమ్రాబాద్, వెలుగు: సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా శక్తివంతమైన మాధ్యమమని, ఇందులో పని చేసే ప్రతి జర్నలిస్టు నైతికంగా, చట్టపరంగా అవగాహన కలిగి ఉండి బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీ శాఖ సమావేశ మందిరంలో రెండు రోజులుగా జర్నలిస్టులకు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా బాధ్యతను మరింత పెంచేందుకు ప్రతి జిల్లాలో సీనియర్ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ట్రైనింగ్క్లాసులకు హాజరవడం అభినందనీయమన్నారు.
మీడియా అకాడమీ త్వరలోనే హైదరాబాద్ లో వారం రోజులు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో 450 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఎడిటర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తోట భావనారాయణ పాల్గొన్నారు.