మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన పగుళ్లు.. తెలంగాణ ప్రజల గుండెకు వచ్చిన పగుళ్లు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టిన లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టే అని ఆరోపించారు. బ్యారేజీ కడుతున్నప్పుడు రైతులు, నిర్వాసితుల పక్షాన ఎన్నోసార్లు ప్రభుత్వంపై పోరాడామన్నారు. కానీ.. బ్యారేజీ పూర్తయ్యాక రాలేకపోయామని తెలిపారు. ఇప్పుడు ఇలా కూలిపోవడం చూసి బాధేస్తున్నదని అన్నారు.
ఎన్నో స్కామ్లు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎగ్గొడుతున్నదని మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. మూడేండ్లలో నిర్మించిన ప్రాజెక్ట్.. మరో మూడేండ్లలో కూలిపోవడం చూస్తే.. డిజైన్లోనే లోపం ఉన్నట్టు స్పష్టమవుతున్నదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ను పక్కకుపెట్టి కాళేశ్వరం నిర్మించి పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు.