ఇంద్ర ఈజ్ బ్యాక్..మరోసారి థియేటర్స్‌‌‌‌లో సందడి

ఇంద్ర ఈజ్ బ్యాక్..మరోసారి థియేటర్స్‌‌‌‌లో సందడి

చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ చిత్రం మరోసారి థియేటర్స్‌‌‌‌లో సందడి చేయబోతోంది. ఆగస్టు 22న ఆయన బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఇంద్ర.. ఇంద్రసేనా రెడ్డి అని అంటుంటే ఒళ్లు గగుర్పెడుతోంది. రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. అది పవర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించింది. అంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం.. ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి చేశారు.

అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి  మాట్లాడుకుంటున్నాం. కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇది. నిర్మాణ విలువలకు అంత పేరు రావడానికి కారణం.. వైజయంతీ మూవీస్ సంస్థ. నా అభిమాన నిర్మాత అశ్వనీదత్. ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్‌‌‌‌ను అందించిన మణిశర్మ, ఎడిటర్ చంటి, డీవోపీ వీఎస్ఆర్ స్వామి..

అలాగే అత్యద్భుతంగా తెరకెక్కించి పెద్ద హిట్ అవడానికి బి.గోపాల్ కారణమయ్యాడు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది. ఈతరం వాళ్లకు దీన్ని బిగ్‌‌‌‌ స్ర్కీన్‌‌‌‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్‌‌‌‌, ప్రియాంక దత్‌‌‌‌లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని చిరంజీవి అన్నారు.