V6 News

పోలీసుల పొరపాటు వల్లే.. మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలికి బెయిల్

పోలీసుల పొరపాటు వల్లే.. మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలికి బెయిల్

 షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో మూడుసార్లు బెయిల్ తిరస్కరణకు గురైనప్పటికీ పోలీసుల రికార్డుల్లో దొర్లిన తప్పులు ఆమెకు వరంగా మారాయి. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ రఘువంశీకి 2025 మే 11న సోనమ్​తో వివాహమైంది.

హనీమూన్​కు మేఘాలయ వెళ్లారు. అక్కడ సోనమ్ తన ప్రియుడు రాజ్​కుష్వాహాతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. జూన్ 2న ముగ్గురు కిరాయి హంతకుల సాయంతో వెయ్ సాడంగ్ జలపాతం వద్ద రాజాను హత్య చేయించింది. ఈ కేసులో సోనమ్‌పై హత్య నేరం కింద ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

తప్పు సెక్షన్ల కారణంగా..

నిందితురాలికి అందించిన అరెస్ట్ గ్రౌండ్స్ పత్రంలో సెక్షన్ 403(1)ని పేర్కొన్నారు. నిజానికి బీఎన్ఎస్​చట్టంలో సెక్షన్ 403(1) లేదు. అరెస్ట్ మెమో, కేసు డైరీ, హక్కుల పత్రం వంటి అన్ని డాక్యుమెంట్లలో సెక్షన్ 103(1) (హత్య)కు బదులుగా 403(1)/238(a) వంటి సంబంధంలేని సెక్షన్లను పోలీసులు పొందుపరిచారు. ఇది సోనమ్​కు అనుకూలంగా మారింది.