- ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలకు చెక్
- స్కైవేపై కాఫీ షాప్లు, స్నాక్స్స్టాల్స్ ఫుడ్ కోర్టులు కూడా..
హైదరాబాద్సిటీ, వెలుగు: మెహదీపట్నం చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న స్కైవాక్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దాదాపు రెండేండ్లుగా కొనసాగుతున్న ఈ నిర్మాణం తుది దశకు చేరుకున్నది. అన్ని పనులు పూర్తయ్యాయని, కొంత కేబుల్పనులు , ఇతర చిన్న పనులు మిగిలి ఉన్నాయని, అన్నీ కంప్లీట్చేసి వచ్చే నెల ఆఖరు వారంలో గానీ, లేక మార్చి నెలలో గానీ అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే ఉప్పల్చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్తో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా కూడా మారింది. దీనికంటే అధునాతనంగా మెహదీపట్నం స్కైవాక్ను తీర్చిదిద్దారు. ఆర్చ్ టైపులో దీనిని రూపొందించడం వల్ల చూడ్డానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.
స్కైవాక్తో సమస్య పరిష్కారం..
మెహదీపట్నం నుంచి రోజూ లక్షల సంఖ్యలో వాహనాలు జర్నీ చేస్తుంటాయి. ముఖ్యంగా 1600 ఆర్టీసీ బస్సులు, వేలాది ఇతర వాహనాలు ఈ కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. మొయినాబాద్, నార్సింగి, పరిగి, శంకర్పల్లి, తాండూరు, వికారాబాద్ వంటి ప్రాంతాలకు ఈ రూట్నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, సిటీ ఆర్టీసీ ఎల్బీనగర్, ఉప్పల్, చర్లపల్లి, దిల్సుఖ్నగర్, హయత్నగర్ తదితర ప్రాంతాల నుంచి మెహదీపట్నం, గోల్కొండ ఇతర ఏరియాలకు ఈ సెంటర్ నుంచే బస్సులను నడుపుతోంది.
హైటెక్సిటీ, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, కోకాపేట, నానక్రామ్గూడ వంటి ఐటీ హబ్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి మెహదీపట్నం ప్రాంతాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఇక్కడికే వస్తుంటారు. ఈ క్రమంలో ఒకవైపు నుంచి మరోవైపు రోడ్డు దాటుతూ ప్రమాదాల భారిన పడుతున్నారు. కొందరు గాయపడుతుండగా, మరికొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. సిగ్నల్స్పట్టించుకోకుండా రోడ్డు దాటే వారితో ట్రాఫిక్సమస్య కూడా ఉత్పన్నమవుతున్నది. దీంతో సమస్య పరిష్కారానికి ఈ చౌరస్తాలో హెచ్ఎండీఏ స్కైవాక్నిర్మాణం చేపట్టింది.
కాఫీ షాప్లు కూడా..
ఈ స్కైవాక్ పై 21,061.42 చదరపు అడుగుల స్థలంలో కాఫీషాప్లు, స్నాక్స్స్టాల్స్, ఫుడ్కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు, పాదచారులు ఆహ్లాదంగా కొంత సేపు గడిపేందుకు సీటింగ్ అరేంజ్మెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ స్కైవే పాదచారులు రోడ్డు దాటేందుకే కాకుండా పిల్లలు, యువత ఆహ్లాదంగా కొంత సమయం గడిపేందుకు ఉపయోగపడనున్నది.
340 మీటర్లు.. 32.47 కోట్లు..
మెహదీపట్నం బస్స్టాప్ నుంచి ఎదురుగా ఉన్న రక్షణ శాఖ స్థలం వరకు 340 మీటర్ల విస్తీర్ణంలో రూ. 32.47 కోట్లతో హెచ్ఎండీఏ దీన్ని నిర్మిస్తోంది. మెహదీపట్నం నుంచి ఆసిఫ్నగర్ పీఎస్వరకూ 160 మీటర్లు, మెహదీపట్నం నుంచి మల్లేపల్లి వైపు 180 మీటర్లు ఈ స్కైవాక్ ఉంటుంది. దీన్ని అందమైన ఆర్చ్మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. స్కైవాక్ పైకి రాకపోకల కోసం ఐదు చోట్ల ఎంట్రీ , ఎగ్జిట్పాయింట్లు పెట్టారు. అన్ని వైపులా 4 నుంచి 5 మీటర్ల వెడల్పులో వాక్వేలు నిర్మించారు. 12 ఎలివేటర్లు పెట్టగా ఒక్కో ఎలివేటర్ పై నుంచి 20 మంది వెళ్లొచ్చు.
