భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాటి ఆరెంజ్ అలెర్ట్ ను రెడ్ అలెర్డ్ గా మారుస్తూ బుధవారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రేపు(గురువారం) కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
నిన్న(మంగళవారం) రాత్రి నుంచి ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో విద్యుత్, మంచినీటి సరఫరా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, లోతట్టు, తీర ప్రాంతాలకు వెళ్లొదని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.