- రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని కేటీఆర్కు మెట్టు సాయి సవాల్
హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారులను, కళాకారులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. ఉద్యమంలో ఎంతో మంది పోరాడినా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మైకు ఉంది కదా అని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన అలా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియెట్లో ఏర్పాటు చేస్తే విమర్శించారని గుర్తుచేశారు.
గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ను వేదిక పక్కన కూర్చోబెట్టుకొని దోకా దివాస్ పేరిట చిల్లర మాటలు మాట్లాడుతుంటే బాధేస్తుందని చెప్పారు. రెండేండ్ల కింద బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
