
- డీఎస్ఈ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని ఐదు మండలాల్లో మిడ్ డే మీల్స్ స్కీమ్ను అక్షయపాత్రకు ఇస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ్ డే మీల్స్ స్కీమ్ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.స్వప్న, ఎస్వీ రమ మాట్లాడుతూ.. షాద్నగర్, శంషాబాద్, హయత్ నగర్, మెట్టు, మహేశ్వరం మండలాల్లో మిడ్ డే మిల్స్ స్కీమ్ను అక్షయ పాత్రకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
దీని వల్ల ఆయా మండల్లాలోని బడుల్లో ఏండ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడతారన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, 8 నెలలుగా పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు, ఆరు నెలల వేతనాలు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి కోశాధికారి కవిత, మిడ్డే మిల్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రుద్రకుమార్, నర్సిరెడ్డి, తిరుమలేశ్, అలివేలు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.