ఇబ్బందులు పడుతున్న మిడ్​ మానేరు ప్రాజెక్టు ముంపు బాధితులు 

ఇబ్బందులు పడుతున్న మిడ్​ మానేరు ప్రాజెక్టు ముంపు బాధితులు 
  • నిర్వాసితుల గోడు పట్టదా?
  • ఇబ్బందులు పడుతున్న మిడ్​ మానేరు ప్రాజెక్టు ముంపు బాధితులు 
  • సమస్యల పరిష్కారానికి పొన్నం 11 కిలోమీటర్ల పాదయాత్ర​

వేములవాడ, వెలుగు: మిడ్ మానేరు ప్రాజెక్ట్ పూర్తై  ఏండ్లు గడుస్తున్నా ముంపు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ​అన్నారు. మిడ్ మానేరు 12 ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్​ మండలం సంకెపల్లి నుంచి చింతలఠాణా వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్​ మాట్లాడారు. మిడ్ మానేరు ప్రాజెక్టు  ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించకుండా గ్రామాలకు వస్తే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ 2015 జూన్​18న వేములవాడ రాజన్న ఆలయం సాక్షిగా నిర్వాసితులకు ఇస్తానన్న రూ. 5 లక్షల  హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ముంపు గ్రామాలవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు  ముంపు గ్రామల ప్రజలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, అర్బన్​మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.