- నగర సమస్యలను ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ గాలికొదిలేశాయి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన వెనుక కేవలం రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో అధికారులతో కలిసి ఆయన ‘బస్తీ బాట’ నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిటీలో జనాభా పెరిగినా దానికి అనుగుణంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. నగర సమస్యలకు సీఎం బాధ్యత వహించాలని, పెండింగ్ సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలనను పట్టాలెక్కించాలని కోరారు.
