ఏపీలో అర్హులైన వారికి రేషన్ కార్డు కావాలంటే 5 రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. లాక్ డౌన్ తో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు అదిగమించేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందనివారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు.
బుధవారం నుంచి రెండో విడత రేషన్ అందిస్తామని.. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా రేషన్దారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.