కరీంనగర్, వెలుగు:మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్పాలిటిక్స్ మొదలుపెట్టారు. కేబినెట్ నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి, ఇండింపెండెంట్గా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇప్పటికే ఈటల రాజేందర్కు సహకరించే చాన్స్ ఉందని నియోజకవర్గంలోని ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేయగా, తాజాగా టీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ ముఖ్యంగా మాజీమంత్రి అనుచరులపై ఫోకస్ పెట్టారు. హైకమాండ్ సూచనల మేరకు కరీంనగర్కు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఓ వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, హైకమాండ్ వెంట నడిస్తే ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం..
తాజాగా మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ లీడర్లు, ముఖ్య కార్యకర్తలతో సోమవారం కరీంనగర్లోని తన క్యాంపు ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గంగుల ఈటల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ టీఆర్ఎస్ను వీడితే ఆయనకే నష్టం తప్ప పార్టీకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. వ్యక్తులు ఉంటారు పోతారు కానీ పార్టీ శాశ్వతమని మంత్రి హితబోధ చేశారు. పార్టీ వెంట నడిచే లీడర్లకు, కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలోపేతమవుతోందని, తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, ప్రజల్లో కేసీఆర్పై అచంచల విశ్వాసం ఉందని, ఎన్నికల్లో వరుస విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్లో ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలుస్తుందని, ఎవరిని నిలబెట్టినా కేసీఆర్ ఫొటోతో విజయం సాధిస్తారని మంత్రి గంగుల చెప్పారు. భవిష్యత్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈటల వ్యవహారంలో త్వరలోనే పార్టీపరమైన చర్యలుంటాయని మంత్రి తెలిపారు. మంథని జడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, హైకోర్టులో వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు చట్టం తన పని తాను చేసుకుపోతోందని గంగుల చెప్పారు. కాగా, కమలాకర్ను కలిసిన వారిలో మొన్నటి వరకు ఈటల వెంట తిరిగిన లీడర్లు కూడా ఉండడం విశేషం.
అనుచరులు లేకుండా చేసే ప్లాన్
మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఈటల క్యాడర్ను మొత్తంగా హైజాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో మాజీ మంత్రి ఈటలకు అనుచరులంటూ లేకుండా చేయాలనేది హైకమాండ్ ప్లాన్గా కనిపిస్తోంది. సీఎం డైరెక్షన్ మేరకే కరీంనగర్జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈటల అనుచరులను నయానో భయానో తమదారికి తెచ్చుకునేందుకు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే బుజ్జగింపుల కంటే ముందు లీడర్లను భయపట్టే ప్రయత్నం చేశారు.ఈక్రమంలోనే ఈటల వెంట తిరిగిన వీణవంక జడ్పీటీసీకి కేడీసీసీ బ్యాంకు నుంచి నోటీసులు పంపించారు. ఈటలతో సన్నిహితంగా ఉన్నాడనే కారణంతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజపై జంట హత్యల కేసును తిరగదోడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా హైకమాండ్ను ఎవరు వ్యతిరేకించినా ఇదే గతి పడుతుందనే హెచ్చరిక పంపించారు. ఇక మంత్రి గంగుల కమలాకర్ ద్వారా కులాల వారీగా లీడర్లు, క్యాడర్ను పిలిపించుకుంటూ అధికార పార్టీ వెంట ఉంటే ఎంత లాభమో, వ్యతిరేకిస్తే అంతే నష్టమని చెప్పిస్తున్నారు.