- మంత్రి పీఆర్వో వసూళ్ల దందా
- స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బేరసారాలు
- సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్
- మరో ఘటనలో మిల్లర్ నుంచి రూ. 10 లక్షలు తీసుకున్న మంత్రి అనుచరుడు
- పీఆర్వోను తొలగించిన గంగుల
కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ దగ్గర ఇటీవల పీఆర్వోగా చేరిన బోనాల మల్లికార్జున్ ఓ ఘటనలో స్టేషన్ బెయిల్ కోసం ఓ వాటర్ప్లాంట్ యజమాని నుంచి రూ. లక్ష డిమాండ్ చేసిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి గంగుల మెడకు చుట్టుకునే అవకాశముండడంతో ఆయన మల్లికార్జున్ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ జరిగింది..
ఇటీవల కరీంనగర్ పోలీసులు సిటీలో అనుమతిలేని వాటర్ ప్లాంట్ల మీద రైడ్ చేసి కొంతమందిపై కేసులు పెట్టారు. ఓ నిర్వాహకుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు మంత్రి పీఆర్వో మల్లికార్జున్ ను కలిశాడు. దీంతో తనకు రూ.లక్ష ఇస్తే స్టేషన్ బెయిల్ ఇప్పించడమే కాకుండా, నాలుగు రోజుల్లో కేసే లేకుండా చేస్తానని మాటిచ్చాడు. 15 రోజుల కింద మంత్రి పీఏ, బాధితుడి మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కింది. సోషల్మీడియాలో వైరల్ కావడంతో అతడిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
పర్మిషన్ ఇప్పిస్తానని రూ.10 లక్షలు
ఇదిలా ఉండగా, మంత్రి గంగుల అనుచరుడొకరు, కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పర్మిషన్ ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని పెద్దపల్లికి చెందిన రైస్మిల్లర్ దేవేందర్రెడ్డి కరీంనగర్ 3 టౌన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..మంత్రి అనుచరుడిగా చెప్పుకునే ఒకరు కస్టమ్ మిల్లింగ్ రైస్కోసం పర్మిషన్ ఇప్పిస్తానని, రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. రూ.10 లక్షలు తీసుకొని పర్మిషన్ ఇప్పించకుండానే మరో రూ. 20 లక్షలు అడిగాడు. దీంతో పైసలు వెనక్కి ఇవ్వాలని బాధితుడు అడగ్గా బెదిరించడంతో పోలీసులనకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ఏమాత్రం వాస్తవం ఉన్నా బాధ్యులపై కేసు నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్3టౌన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.