రేషన్ డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని డీలర్లకు సూచించారు. రేషన్ డీలర్ల సమస్యలపై మే 11వ తేదీన హైదరాబాద్ లోని అధికారిక నివాసంలో పౌర సరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, ఉన్నతాధికారులతో గంగుల సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో రేషన్ కోసం ప్రభుత్వం ఏటా రూ. 3580 కోట్లు ఖర్చుచేస్తుందన్నారు గంగుల. రాష్ట్రంలో ప్రస్తుతం 17,220కు పైగా రేషన్ షాపులను నిర్వహిస్తున్నామని.. ఈ డీలర్లందరికీ నెలకు 12 కోట్ల పై చిలుకు కమిషన్ రూపంలో అందజేస్తున్నామని చెప్పారు. రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సూచించారు. మే 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశమవుతామని.. సమ్మే ఆలోచన విరమించుకోవాలని డీలర్లకు సూచించారు గంగుల. రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. పేదల ప్రయోజనాలకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు.
గౌరవ వేతనం ఇవ్వాలి
కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.లేకుంటే జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మెకు దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు మే 10న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐక్య వేదిక చైర్మన్ నాయకోటి రాజు,ఉపాధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాపును కేటాయించడంతో పాటు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే వంటావార్పు, చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.