ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చు

ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదని.. ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కి కొరత లేదని, అనవసర పుకార్లకు ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ సంస్థల బస్సులు సైతం రిటైల్ బంకుల నుండే డీజిల్ ని వాడుకుంటున్నారని అందువల్ల బంకుల్లో త్వరత్వరగా స్టాక్స్ అయిపోతున్నాయని, వీటిపై సివిల్ సప్లైస్ డిపార్మెంట్ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొరత లేకుండా చూస్తోందన్నారు.  

ఇక రాష్ట్రంలో మొత్తం అన్ని కంపెనీలవి కలిపి 3,520 బంకులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 480 బంకుల్లో నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగిస్తున్నామన్నారు. 807 ఎల్పీజీ ఔట్ లెట్లలో సైతం కావాల్సినంత స్టాక్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్ గా ఉండేవిధంగానే పెట్రోల్ 38,571 కిలో లీటర్లు, డీజిల్ 23,875 కిలో లీటర్లు ఉందని, ఇది నాలుగు నుంచి ఐదు రోజులకు సరిపోతుందని, స్టాక్ మూమెంటును బట్టి ఎప్పటి మాదిరిగా నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ రాష్ట్రానికి వస్తూనే ఉందన్నారు.