రైతుకు కేసీఆర్ కొండంత అండ: మంత్రి హరీశ్

 రైతుకు కేసీఆర్ కొండంత అండ: మంత్రి హరీశ్

రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మార్చి 26వ తేది ఆదివారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు హరీశ్ రావు. అనంతరం మాట్లాడిన మంత్రి.. రైతులంటే కేసీఆర్ కు మక్కువ అని తెలిపారు. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ రూ.10 వేలు అందిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.  రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసిందని హరీశ్ రావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు, రైతు భీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేసి ఇస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసింది. కానీ సీఎం కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని, రైతులను కేసీఆర్ ఓదారిస్తే, బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవాచేశారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తరహా పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని పక్క రాష్ట్రాలలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. 

పంట నష్టం కింద సీఎం కేసీఆర్ ఎకరాకు 10 వేలు ప్రకటిస్తే.. 10 వేలు చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సన్నాయి నొక్కులు నొక్కతున్నారని విమర్శించారు హరీశ్ రావు బీజేపీ నాయకులకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వండని డిమాండ్ చేశారు హరీశ్ రావు. సీఎం కేసీఆర్ 10 వేలు, కేంద్రం నుంచి 10 వేలు కలుపుకుని రైతుకు 20 వేలు ఇద్దామని.. రైతుల పక్షాన అండగా నిలుద్దామని బీజేపీ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి మాటలు తప్ప చేతలు ఉండవని, బాయికాడ విద్యుత్ మీటర్లు పెడితే పైసలిస్తామని బీజేపీ మెలిక పెటిందని విమర్శించారు. పక్క రాష్ట్రాల వాళ్ళు మీటర్లు పెట్టి పైసలు తీసుకున్నారని, కానీ సీఎం కేసీఆర్ మీటర్లు వద్దే వద్దన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు కాలువల్లో పారడం లేదనంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఆ కాలువల్లో ముంచితే నీళ్లు పారుతున్నాయా లేదా తెలుస్తుందని మంత్రి ఎద్దేవ చేశారు.