
సిద్దిపేట జిల్లా: మహిళలను కించపరుస్తూ మాట్లాడటం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమంజసం కాదని, భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం తో ఉన్న సుజాతక్కను అసమర్ధురాలు అన్నందుకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీశ్ రావు. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడం చాలా బాధాకరమని, దుబ్బాక నియోజకవర్గంలో పోటీ చేయనున్న ఆయన భార్య, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను ప్రతిపక్షాలు చిన్న చూపుచూస్తూ మాట్లాడటం సరికాదన్నారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో దుబ్బాక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ సంఘీభావ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుజాతక్కకు తోబుట్టవులా ఉంటా.. సోదరునిలా సహకరిస్తా అని తాను అన్న మాటలకు… ఆమె అసమర్ధురాలు అని ఉత్తమ్ కుమార్ అనడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవం ఎంటో తెలుస్తుందన్నారు. రేపు దుబ్బాక లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి మహిళలు , దుబ్బాక ప్రజలు బుద్ధి చెపుతారు..
తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తున్నారన్నారన్న హరీశ్ రావు.. దుబ్బాక వైపు ఎప్పుడూ కనిపించని మనుషులు , నాయకులు ఈరోజు కనిపిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలైన ఏ పార్టీ కూడా ఎన్నికల తర్వాత ఎవరు కూడా కనిపించరని, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాబోయే ఎమ్మెల్యే సుజాత అక్క , తాను ఎన్నికలు అయిపోయాక కూడా ప్రజల వైపు ఉంటామని అన్నారు.
ప్రతి కుల సంఘాల గురించి, ప్రతి కార్మికుల గురించి మంచి అవగాహన ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. మహిళలకు కెసిఆర్ కిట్టు, రైతులకు రైతు బీమా పథకాలతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి దక్కిందన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పుడు వరకు ఏం మంచి పని చేశారో చెప్పాలన్నారు హరీశ్ రావు. దుబ్బాక లో ఉంటున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి వాకింగ్ వెళ్లి దుబ్బాకలో జరిగిన అభివృద్ధి పనులు చూడాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలు హడావిడి చేస్తాయని ఒక్కసారన్నా దుబ్బాక వైపు చూసారా అని కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం నీళ్ళు ఈ జన్మలో చూస్తాము అని అనడం దానికి సమాధానంగా కేసీఆర్ నీళ్లు తేవడం జరిగిందన్నారు.
సమావేశంలో గూడ్స్ ఆటో, ప్యాసింజర్ ఆటో కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు హరీశ్ రావు. దుబ్బాక మున్సిపాలిటీ సహకారంతో రానున్న రోజుల్లో ఆటో కార్మికులకు అందరి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.