
కోవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో మంత్రి మాట్లాడారు.
జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు , హోం క్వారంటైన్ కిట్లకు ఎలాంటి కొరత లేదని, కిట్లు లేవన్న సాకులు చెప్పొద్దని అధికారులకు సూచించారు. ప్రతీ రోజు పీహెచ్ఎసీలో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాధమిక దశలో కరోనాను గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని.. కాబట్టి కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పారు. పాజిటీవ్ కేసు ఒక్కటి వచ్చినా వారి ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కరోనా టెస్ట్ లు చేయాలన్నారు. కరోనా బారిన పడిన వారితో ప్రతీ రోజూ డాక్టర్లు, ఎ.ఎన్.ఎం. లు మాట్లాడి.. వారిలో ఆత్మస్థైర్యం నింపాలని చెప్పారు. గ్రామాల్లో కరోనాపై ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ రోగులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని, దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని.. ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులు పాలు కావద్దన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎలాంటి చికిత్స ఇస్తున్నారో… అదే చికిత్సను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ప్రభుత్వ వైద్యసిబ్బంది రక్షణ బాధ్యత తమదని.. ఎలాంటి ఆందోళ చెందకుండా పనిచేయండని చెప్పారు.
ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా రాకుండా రోజూ వేడి నీళ్లు తాగాలని, ఆవిరి పట్టాలని చెప్పారు. తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తే ఎవరూ అలక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు.