ప్రజారోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి హరీష్ రావు

ప్రజారోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి హరీష్ రావు

పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముందస్తుగా అప్రమత్తమై ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందని మంత్రి హరీష్ రావు వివరించారు. మార్చి మొదటి వారంలో సమీక్ష నిర్వహించి.. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, వారి ద్వారా సబ్ సెంటర్, పీహెచ్ సీ సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలోనూ శిక్షణ ఇచ్చామన్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో తెలంగాణ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. 

పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధం చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పీహెచ్ సీ, యూపీహెచ్ సీ సహా అన్ని ఆసుపత్రుల్లోనూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని, దీంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వడ దెబ్బ తగిలిన పెద్దలు, చిన్నారులకు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రత్యేకంగా వార్డులు, ఐసీయూ బెడ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

108 అంబులెన్సులు అందుబాటులో ఉంచి, తక్షణం వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి హరీష్ రావు వివరించారు. అంబులెన్సుల్లో అవసరమైన మందులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాల్లోనూ ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రప్రభుత్వం, వాతావరణశాఖ సకాలంలో అప్రమత్తం చేయడం వల్ల అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మరింత వేగవంతమవుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు సూచించారు.