గ్యారంటీలు దేవుడెరుగు.. ఓట్లు పడతాయన్న గ్యారంటీనే లేదు: హరీశ్ రావు

గ్యారంటీలు దేవుడెరుగు.. ఓట్లు పడతాయన్న గ్యారంటీనే లేదు: హరీశ్ రావు
  • ఆత్మవంచన, పరనిందగా కాంగ్రెస్​ సభ : మంత్రి హరీశ్​రావు
  • గ్యారంటీలు దేవుడెరుగు.. ఆ పార్టీకి ఓట్లు పడతాయన్న గ్యారంటీనే లేదు
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మేమెక్కడ సపోర్ట్​ చేసినం.. రాహుల్​ అజ్ఞానానికి జోహార్లు
  • మా లీడర్లను వేటకుక్కల్లాగా ఈడీ, సీబీఐ వేధిస్తున్నా కనిపిస్తలేదా?
  • కాంగ్రెస్​ రాష్ట్ర నేతలపై ఒక్క ఈడీ, సీబీఐ కేసు కూడా ఎందుకు లేదు?
  • బీజేపీ, కాంగ్రెస్​ మిలాఖత్​ అయినయని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ సభ ఆసాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ‘‘అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలతో సభను నిర్వహించారు” అని ఆదివారం ఆయన ట్వీట్​ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయతోనో రాలేదని, ప్రజలు పోరాడి గెలుచుకున్నారని తెలిపారు. కాంగ్రెస్​ దయతోనే వచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానాలు చేసుకున్నారని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్​ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు.. అసలు కాంగ్రెస్​కు ఓట్లు పడతాయనే గ్యారంటీనే లేదు. అవి వారంటీ లేని గ్యారంటీలు” అని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ విజయభేరి సభలోని హామీలు.. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టున్నాయని విమర్శించారు. ‘‘నెత్తి నాది కాదు.. కత్తి నాది కాదు.. అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన గ్యారంటీలన్నీ కేసీఆర్​ అమలు చేస్తున్న పథకాల నుంచి కాపీ కొట్టినవే’’ అని ఆయన విమర్శించారు.  

రాహుల్​ అజ్ఞానానికి జోహార్లు

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతివ్వలేదని, యశ్వంత్​ సిన్హాకు మద్దతిచ్చామని హరీశ్​ గుర్తు చేశారు. కావాలంటే పేపర్లు తిరగేసి చూసుకోవాలన్నారు. రాహుల్​ అజ్ఞానానికి జోహార్లు అని కామెంట్​ చేశారు. యశ్వంత్​ సిన్హాను తెలంగాణకు పిలిచి భారీ సభను పెట్టామని, కావాలంటే కాంగ్రెస్​ పార్టీ నేతలనే అడిగి రాహుల్​ అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాము బీజేపీకి మద్దతివ్వలేదని తెలిపారు.  ‘‘జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్. 

Also Rard: ఉన్నత చదువు క్రమశిక్షణతోనే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి 

ఆ జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్​ మద్దతివ్వడం లేదా? కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉందా.. లేదా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? ఎందుకీ నయవంచక ముచ్చట్లు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు తెలియదా? రాహుల్​ జోడో యాత్ర గుజరాత్​కు ఎందుకు వెళ్లలేదు? హుజూరాబాద్​, మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో సిగ్గులేకుండా బీజేపీకి కాంగ్రెస్​ సపోర్ట్​ చేయడం మీకు తెలియదా?’’ అని హరీశ్​ ప్రశ్నించారు. 

మా నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నా కనిపించట్లేదా?

ఈడీ, సీబీఐ వేటకుక్కల్లా తమ పార్టీ నేతలను వేధిస్తున్నాయని, అది రాహుల్​కు కనిపించడం లేదా అని హరీశ్​ ప్రశ్నించారు. ‘‘మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్​, గంగుల కమలాకర్​, పువ్వాడ అజయ్​, ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌‌‌‌‌‌‌‌. రమణ, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి తదితరులపై బీజేపీ ఈడీ, సీబీఐ పేరుతో వేధించినది మీకు కనిపించడం లేదా” అని వ్యాఖ్యానించారు. నేషనల్​ హెరాల్డ్​ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్తారా అని నిలదీశారు. రాబర్ట్​వాద్రా కంపెనీలపై బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోని కాంగ్రెస్​ నేతలపై ఒక్క ఈడీ, సీబీఐ కేసు కూడా ఎందుకు లేదని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్​ మిలాఖత్​ అయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ‘‘అవినీతి గురించి మీరు మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుంది. మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే వేలున్నాయి. స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే మీరు. మీది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కాదు.. స్కాంగ్రెస్​. బోఫోర్స్​ నుంచి దాణా, చక్కెర కుంభకోణాలు ఒకటా.. రెండా.. దేశంలో అవినీతికి కేరాఫ్​ అడ్రస్సే మీరు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్​లో కుంభ‌‌‌‌‌‌‌‌కోణ‌‌‌‌‌‌‌‌మే క‌‌‌‌‌‌‌‌నిపిస్తుంది. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడిన‌‌‌‌‌‌‌‌ట్టు ఉంట‌‌‌‌‌‌‌‌ది’’ అని హరీశ్​ విమర్శించారు. 

రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు?

హైదరాబాద్​లో ప్రకటించిన హామీలన్నింటినీ దేశమంతా అమలు చేస్తామని కాంగ్రెస్​ ఎందుకు చెప్పలేకపోతున్నదని హరీశ్​ ప్రశ్నించారు. ‘‘మీది జాతీయ పార్టీనా? లేదా ప్రాంతీయ పార్టీనా? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు? మీ సీడబ్ల్యూసీ మీటింగ్​లోనే దేశమంతా అమలు చేస్తామని ఎందుకు తీర్మానం చేయలేదు? మీరిచ్చింది వారంటీలు లేని గ్యారంటీలు. కర్నాటకలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేక వందరోజుల్లోనే ఆగమవుతున్నారు. కరెంటు లేదని అక్కడి రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారు. చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఏరుదాటాక తెప్ప తగలబెట్టేరకం మీరు. తెలంగాణలో ఇచ్చినట్టు దళితబంధు, రైతుబంధు పథకాలను దేశమంతా ఇవ్వగలరా? ఎన్నికలొచ్చినప్పుడు నోటికి వచ్చింది చెప్పుడే తప్ప.. ఆ గ్యారంటీలను అమలు చేసేది ఎవరు? ఇట్ల బూటకపు హామీలిచ్చినందుకే లోక్​సభ ఎన్నికల్లో 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లు వచ్చాయి’’ అని ఆయన ఎద్దేవా చేశారు.