- హామీ మేరకు గ్యారంటీలుఅమలు చేస్తున్నం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలో ఓ ఫంక్షన్ హాల్ లో ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి పాలనలో ఏ సీఎం చేయనన్ని అప్పులు మాజీ సీఎం కేసీఆర్ చేశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్లు ఆయన భావదారిద్ర్యాన్ని, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మండిపడ్డారు.
గత పదేండ్లు ఆరాచక పాలన సాగించిన కేసీఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు.
