గాంధీ, అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకెళ్దాం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

గాంధీ, అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకెళ్దాం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు: మహాత్మాగాంధీ, అంబేద్కర్​ ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్దామని  మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మండలంలోని కల్వరాల గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  పాదయాత్ర చేపట్టారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు బ్రిటీష్  పాలనలో  వివక్షతకు, అరాచకాలకు వ్యతిరేకంగా గాంధీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికీ అందించాలనేదే గాంధీ ఆలోచన అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రచించేందుకు అంబేద్కర్  శ్రమించారని, అంటరానితనాన్ని నిషేధించి ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచారని కొనియాడారు.

భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్  ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  నినాదాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు వీపనగండ్లలో రూ.50 లక్షలతో నిర్మించనున్న జీపీ బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. స్పోర్ట్స్  అథారిటీ చైర్మన్  శివసేనారెడ్డితో ఫోన్​లో మాట్లాడి వీపనగండ్లలో మినీ స్టేడియం నిర్మించేందుకు రూ.4 లక్షలు  విడుదల చేయాలని కోరారు. పర్యాటశాఖ అధికారి నరసింహ,  ఏఎంసీ చైర్మన్  సుదర్శన్ రెడ్డి, నారాయణరెడ్డి, బీరయ్య, రవీందర్ రెడ్డి, గోపి, వెంకటయ్య, భరత్ రెడ్డి, వెంకట రాజయ్య, చక్రా వెంకటేశ్​ పాల్గొన్నారు.