బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇచ్చిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ పాలిచ్చే గేదెవైతే 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందని కేసీఆర్ ను ప్రశ్నించారు. గతంలో అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా జరిగాయని ఆరోపించారు. తానే రాజు, నియంతనని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి 7 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టారన్నారు.
కాంగ్రెస్ కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు జూపల్లి. బీఆర్ఎస్ బీజేపీలు పొత్తుపెట్టుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో బానిస బతుకులుండేవన్నారు. ప్రగతి భవన్ కు వచ్చి ఇపుడు బాధలు చెప్పుకోవచ్చన్నారు. కేసీఆర్ కు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ మాట్లాడే భాష సరిగా లేదన్నారు. కేసీఆర్ పాలన చేతగాక..రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు.