లోక్ సభలో మంత్రి కిషన్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ

లోక్ సభలో మంత్రి కిషన్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇవాళ లోక్ సభలో హుషారుగా కనిపించారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైమ్ లో ఆయన రన్నింగ్ కామెంటరీతో నవ్వులు పూయించారు. ధర్మపురి అరవింద్ ప్రమాణం పూర్తయ్యాక.. కంగ్రాట్స్ అంటూ అభినందించారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం చేస్తూ.. జై భారత్.. జై తెలంగాణ అన్నప్పుడు గుడ్ ప్రభాకర్ గుడ్.. కంగ్రాట్స్ అంటూ అభినందించారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణానికి వచ్చినప్పుడు కొందరు బీజేపీ సభ్యులు భారత్ మాతాకీ జై అని స్లోగన్స్ ఇచ్చారు. నినాదాలు ఆపాలంటూ కిషన్ రెడ్డి మిగతా సభ్యులకు సూచించారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు “మీ వాళ్లు కొట్టకపోయినా నేను కొడతాలే అన్నా.. నేను కొడతా చప్పట్లు” అని కిషన్ రెడ్డి అన్నారు. తర్వాత ఆయన లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఎంపీగా మాలోత్ కవిత ప్రమాణానికి వచ్చినప్పుడు..”కవితమ్మ పోయినా ఈ కవితమ్మ ఉంది” అని అనడంతో… ఎంపీ స్మైలిచ్చారు. జై తెలంగాణ.. జై బంజారా అని కవిత అన్నప్పుడు.. భారత్ మాతా కూడా అంటే అయిపోవు అని కిషన్ రెడ్డి అన్నారు.